యువకుడిని కాపాడిన నటుడు

యువకుడిని కాపాడిన నటుడు

ఒకే క్షణం. ఒకే ఒక క్షణం. లేదంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. వాళ్లే లేకుంటే అక్కడ ఘోరం జరిగిపోయేదే. ఇద్దరు యువకుల సమయస్ఫూర్తి, మానవత్వం ఆ యువకుని ప్రాణాలను కాపాడింది. ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకున్ని చాకచక్యంగా కాపాడారు ఇద్దరు యువకులు. హైదరాబాద్‌ అత్తాపూర్‌ 125 పిల్లర్‌ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

అతనెవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఫ్లై ఓవర్‌పై ఎక్కి చివర కూర్చున్నాడు. దూకడానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో జిమ్‌ ముగించుకుని అటుగా వెళ్తున్న నటుడు ఇంద్రసేన ఇది గమనించారు. వెంటనే ఇద్దరు కుర్రాళ్లను అక్కడి పంపించారు. వెంటనే బైక్‌ను పక్కకు ఆపిన ఆ యువకులు... క్షణాల్లో అతన్ని వెనక్కి లాగేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అప్పటికే ఇది గమనించి స్థానికులు.. కింద నుంచి అతన్ని వారించారు. కిందికి దిగాలంటూ కేకలు వేశారు. అయినా అవన్నీఅతడు పట్టించుకోలేదు. చివరకు యువకులు రంగ ప్రవేశం చేయడంతో కథ సుఖాంతమైంది. చాకచక్యంగా యువకున్ని కాపాడిన నటుడు ఇంద్రసేన, ఇద్దరు కుర్రాళ్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

యువకుని గురించి ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. బ్రిడ్జ్ పై నుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తానన్నారంటూ చెప్పుకొచ్చాడు. విచిత్రమైన సమాధానాలు చెప్పడంతో మతిస్థిమితం లేదని గ్రహించారు. ఆకలిగా ఉందని చెప్పడంతో నటుడు ఇంద్రసేన స్పందించి భోజనం పెట్టించారు. ఆ తర్వాత తేరుకున్న యువకుడు... తన వివరాలేమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని మాటలను బట్టి చూస్తే ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story