తమ్ముడికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చిన అన్న

తమ్ముడికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చిన అన్న

వ్యాపారంలో ఎదగడానికి తమ పరాయి అనే బేధం చూడరు బిజినెస్‌ బిగ్‌ షాట్స్‌. సొంత సోదరైనా, సోదరుడైనా తొక్కేయాలని చూస్తారు. ఇలాంటి కథనాలు ఎన్నో చూశాం కూడా.. కానీ ఓ భారత వ్యాపార దిగ్గజం మాత్రం తన తమ్ముడికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయినా తమ్ముడ్ని ఆదుకునేందుకు.. పెద్దమనసు చేసుకున్నాడు. ఆ అన్నదమ్ములు ఎవరో కాదు.. వారే వ్యాపార దిగ్గజాలు ముఖేష్‌, అనిల్‌ అంబానీలు.

కార్పొరేట్‌ బ్రదర్స్‌గా.. అపూర్వ సోదరులుగా వ్యాపార వర్గాల్లో పేరు తెచ్చుకున్న అంబానీ సోదరులు మరోసారి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమో చాటుకున్నారు. భారీ నష్టాలతో అప్పుల్లో ఊబిలో మునిగిపోయిన సోదరుడ్ని అలా వదిలేయకుండా.. ఆదుకోడానికి రంగంలోకి దిగాడు భారత నెంబర్‌ వన్‌ బిజెనెస్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ.

ధీరూభాయ్‌ అంబానీ తనయులైన ముకేష్‌, అనిల్‌ అంబానీలు ఎవరి వ్యాపారాలు వారు చూసుకుంటూ వస్తున్నారు. వ్యాపారంలో మొదట ఇద్దరు పోటాపోటీగా దూసుకెళ్లినప్పటికీ, ఆ తర్వాత అనిల్ దూకుడు తగ్గింది. ఓ పద్ధతి ప్రకారం బిజినెస్ చేస్తూ అపర కుబేరునిగా ముకేష్ ఎదిగారు. వ్యాపారంలో రాణిస్తూ ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో ప్రతి ఏడాది దూసుకుపోతున్నారు. రకరకాల బిజినెస్‌లలో వేలు పెట్టి అనిల్ అంబానీ నష్టపోగా, ఇటీవలి కాలంలో అనిల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతినడంతో దివాళా తీశారు.

గతంలోనే తమ్ముడ్ని అప్పుల నుంచి బయట పడేసేందుకు 7 వేల 3 వందల కోట్ల విలువైన ఆర్ కామ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి గతంలో ముకేష్ ట్రై చేశారు. ఐతే టెలికం శాఖ అనుమతి లభించకపోవడంతో ఆ డీల్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా తమ్ముడికి ముకేష్ సాయం చేశారు. ఎరిక్సన్ కంపెనీకి కట్టాల్సిన 580 కోట్ల అప్పును ముకేష్ అంబానీ చెల్లించి అనిల్‌ జైలుకు వెళ్లకుండా తప్పించారు.

ఇప్పుడు మరోసారి ముకేష్ నేతృత్వంలోని జియో సంస్థ, అనిల్‌ కి సంబంధించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. టెలికం బిజినెస్‌లో జియో దూసుకుపోతుంటే, ఆర్ కామ్ చతికిలపడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాళా తీసింది. దాంతో సోదరున్ని గట్టెక్కించడానికి ముకేష్ అంబానీ చర్యలు చేపట్టారని బిజినెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆర్ కామ్‌కు సంబంధించిన టవర్లు, ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేయడానికి ముకేష్ అంబానీ బిడ్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే, నవీ ముంబైలోని భూములు, ధీరూబాయ్ నాలెడ్జ్ సిటీని కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ముకేష్ ఉన్నారని తెలుస్తోంది. వీటి విలువ 25 వేల కోట్లు ఉంటుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story