నిమ్మకాయలతో సీఎం పదవిని కాపాడుకుంటున్నారా.. - బీజేపీ ఎమ్మెల్యే
కర్నాటక సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. చివరి అంచున వేలాడుతూనే ఉంది. శుక్రవారమే శుభం కార్డు పడుతుంది అనుకుంటే.. సోమవారానికి సీక్వెల్ మొదలు కానుంది. సర్కార్ బలపరీక్షపై అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. అయితే సభలోకి సీఎం సోదరుడు నిమ్మకాయలతో రావడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిమ్మకాలతో సీఎం పదవిని కాపాడుకుంటున్నారా అంటూ ఎద్దేవ చేసింది. మంత్రాలకు సీఎం పదవులు వస్తాయా అంటూ కుమారస్వామి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
కర్నాటక అసెంబ్లీలో అందరి ఫోకస్ నిమ్మకాయలపై పడింది. సీఎం కుమారస్వామి మంత్రాలతో తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. అందుకే ఓటింగ్ జరగకుండా చూసుకుంటున్నారని.. సభలో చేతబడి చేయాలనుకుంటున్నారు అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. విపక్ష ఆరోపణలపై స్పందించిన కుమారస్వామి మంత్రాలతో అధికారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. మంత్రి రేవణ్ణ సహజంగానే భక్తుడని, రోజూ ఆలయానికి వెళుతూ ఉంటారని చెప్పారు. అదే సమయంలో గుడికి వెళ్లగా అక్కడ పూజారులు నిమ్మకాయలు ఇచ్చారని, వాటిని తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినా.. అక్కడ వారికి కూడా నిమ్మకాయలు ఇస్తారని చెప్పారు.
ఏదీ ఏమైనా అసెంబ్లీలో నిమ్మకాయలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. అధికార విపక్షాల మధ్య నిమ్మకాయలపై మాటల తూటాలు పేలాయి. ప్రభుత్వం బలపరీక్షపై చర్చ జరుగుతున్న సమయంలో.. సాక్షాత్తూ సీఎం సోదరుడు, మంత్రి హెచ్డీ రేవణ్ణ చేతిలో నిమ్మకాయలు కనిపించడంతో కాసేపు రచ్చ జరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com