ట్రంప్ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు
కాశ్మీర్ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశంలోనే నిరసన వ్యక్తమవుతోంది. కాశ్మీర్ అంశం పూర్తిగా పాక్-భారత్లకు సంబంధించిందని అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వినిపించింది. అమెరికా కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఈ విషయంలో ట్రంప్ తరఫున క్షమాపణలు కోరుతున్నామన్నారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకునేందుకే ఇలా దిద్దుబాటు ప్రకటనలు చేసినట్టు తెలుస్తోంది. కాశ్మీర్ అంశం ద్వైపాక్షిక సమస్య అని.. దీనిపై రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోదలిస్తే అమెరికా దానిని స్వాగతిస్తుందన్నారు. అసలు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే.. ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా సహకారం మాత్రం ఉంటుందన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా ప్రతిపక్ష పార్టీ సభ్యులు విమర్శలు కుప్పించారు . కశ్శీర్ విషయంలో ట్రంప్కు పరిపక్వత లేదని ఆరోపించారు. దక్షిణాసియాలో భారత్- పాక్ల మధ్య నెలకొన్న కశ్మీర్ సమస్య ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. ఈవిషయంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వానికి భారత ప్రధాని ఒప్పుకోరని తాము భావిస్తున్నట్లు డెమోక్రటిక్ ప్రతినిధి బ్రాడ్ షెర్మన్ ట్విట్ చేశారు.
కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయాలని మోడీ అడిగారని ట్రంప్ చెప్పడాన్ని.. కేంద్రం ఇప్పటికే ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపడుతూ విదేశీ వ్యవహారాల మంత్రత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ప్రకటన జారీచేశారు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని మోదీ కోరలేదని స్పష్టంచేశారు . భారత్, పాకిస్థాన్కు సంబంధించిన అంశాలన్నింటినీ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని భారత్ స్పష్టం చేసింది.. ఇందుకోసం సరిహద్దు ఉగ్రవాద, సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ఉన్నాయని గుర్తుచేసింది. అటు ట్రంప్ ప్రకటన తర్వాత ఏం జరిగిందనే అంశంపై వివరణ ఇవ్వాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com