పాక్ మోదీకి భయపడుతోందా.?

పాక్ మోదీకి భయపడుతోందా.?

దొంగే .."దొంగా..దొంగా" అని అరిచినట్లుంది పాకిస్తాన్ వైఖరి. చేయాల్సిందంతా చేసి..మళ్లీ మనపైనే నిందలు వేయడం ఆదేశానికి అలవాటే. ఇన్నాళ్లుగా ఇదే జరుగుతూ వచ్చింది. అయితే గుంటనక్క పాక్ ఇటీవల క్రమంగా దిగివస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ తలదించుకు వెళ్లిపోతున్నాడు? ఏమిటీ మార్పు? పాక్ మళ్లీ కొత్త డ్రామాకు తెరతీసిందా? లేక మోడీకి భయపడుతోందా.?

ఇప్పటి వరకు ఒక లెక్క! ఇకపై మరో లెక్క! పాకిస్తాన్ డ్రామాలను ఉపేక్షించే రోజులు పోయాయి. కుక్కతోక పాక్‌కు గట్టిగానే బుద్ధిచెప్పాలని డిసైడ్ అయింది భారత్. ఈ విషయం దాయాదికి కూడా బాగానే తెలిసొచ్చింది. అంతర్జాతీయ సమాజంలో ఆ దేశాన్ని దోషిగా నిలుపడంలో ఇప్పటికే మనం చాలా వరకు సక్సెస్ అయ్యాం. ఇటీవల తగులుతున్న వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది పాక్. అటు అమెరికా కూడా భారత్‌ను కాదని మేం ఏం చేయలేమంటూ సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు ఉగ్రవాదంపైనా కాస్త గట్టిగానే క్లాస్ పీకింది. ఈ ముప్పేట దాడితో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తలబొప్పికట్టింది. అందుకే ఆ దేశ వైఖరిలో కాస్త మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ ఇటీవల కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది.. అయితే ఇదంతా దాయాది ఆడుతున్న కొత్త డ్రామా అన్న విమర్శలూ వినిపిస్తున్నాయి..

అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ అంటేనే ఓ బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఉగ్రవాదానికి ఆ దేశం స్వర్గధామం అన్న విషయం అందరికీ తెలుసు. ఈ మచ్చ అంత ఈజీగా చెరిగిపోయింది కాదు. ఆ విషయం పాకిస్తాన్ కు తెలుసు అందుకే కొన్ని నష్టనివారణ చర్యలు చేపట్టారు ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ముఖ్యంగా అమెరికా పర్యటనకు ముందు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల తర్వాత తమ గగన తలాన్ని మూసేసిన పాకిస్తాన్‌.. అనూహ్యంగా.. ఎయిర్‌స్పేస్‌ను తెరుస్తున్నట్లు ప్రకటించింది. మరుసటిరోజే.. అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను అరెస్ట్‌ చేసింది. ఈ రెండు పరిణామాలు పాకిస్తాన్‌ వైఖరిపై అంతర్జాతీయంగా చర్చను లేవనెత్తాయి.

మొన్నటికి మొన్న పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించింది పాకిస్తాన్‌ సైన్యం. తద్వారా అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల భావనలను తగ్గించేందుకు ప్రయత్నించింది. జెనీవా ఒప్పందాన్ని పాటించి.. తమ సైన్యానికి చిక్కిన 80 గంటల్లోనే అభినందన్‌ను అధికారికంగా భారత్‌కు అప్పగించింది.

వాస్తవానికి మోడీ రెండోసారి అధికారంలోకి పాకిస్తాన్ వైఖరిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. మన ప్రధాని దూకుడుగా వెళ్లడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కశ్మీరులోయలో అల్లకల్లోలం సృష్టిస్తూ నిత్యం రావణకాష్టాన్ని రగిలిస్తోన్న దాయాదిదేశాన్ని దెబ్బకొట్టేందుకు మోదీ-అమిత్‌షా ద్వయం, ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఓవైపు లోయలో టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ.. మరోవైపు అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల విభజన కూడా ఈ స్కెచ్ లో భాగమే.. ఇదే జరిగితే అక్కడ రాజకీయ స్వరూపమే మారిపోతోంది. పాక్ ఆగడాలకు పూర్తిగా చెక్ పడుతుంది..

భారత్‌ దూకుడు, మోడీ రహస్య వ్యూహాలను గ్రహించిన పాకిస్తాన్‌.. వెనక్కి తగ్గుతున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కుక్కతోక లాంటి పాక్‌ను ఏమాత్రం నమ్మకూడదన్న వాదన కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయంగా తమపై ఉన్న ముద్రను తొలగించుకోవడంలో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ ...పూర్తిగా సరెండర్ అయినట్లు నటిస్తున్నారంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇకపై మన జోలికి రావాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకునే పరిస్థితి కల్పించడంలో సక్సెస్ అయ్యాం.!

Tags

Read MoreRead Less
Next Story