ఘనంగా 20వ కార్గిల్ విజయ్‌ దివస్‌ వేడుకలు

ఘనంగా 20వ కార్గిల్ విజయ్‌ దివస్‌ వేడుకలు

భారత్ మీసం మెలేసిన సుదినం జులై 26.. కార్గిల్‌లో పాకిస్థాన్ పీచమణిచిన మన సైన్యానికి సలామ్ కొట్టాల్సిన రోజు.. అప్పుడు కార్గిల్ యుద్ధంలో రక్తపాతం లెక్కచేయకుండా మన జవాన్లు పోరాడారారు. మంచుకొండల్లో ప్రాణాలను పణంగా పెట్టి సమరం సాగించారు. ఆ విజయానికి గుర్తుగా విజయ్‌ దివస్‌ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 20వ కార్గిల్ విజయ్‌ దివస్‌ వేడుకలు దేశవ్యాప్తంగా వేడుకలా నిర్వహించారు. కార్గిల్‌ యుద్ధంలో వీరోచిత పోరాటం చేసి.. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర జవాన్లను స్మరించుకున్నారు. నేషనల్‌ హీరోస్‌కు ఘన నివాళులర్పించారు.

ఢిల్లీలోని వార్‌ మెమోరియల్‌ దగ్గర కార్గిల్‌ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. వారు మెమోరియల్‌ దగ్గర అమర వీరులకు ఘన నివాళులర్పించారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అమర సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అటు అహ్మదాబాద్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయరూపాని వీర జవాన్లకు నివాళులర్పించారు. గోల్డెన్‌ కటార్‌ మెమోరియల్‌లో జరిగిన విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్‌లో కార్గిల్‌ మెమోరియల్‌ దగ్గర ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావాత్‌ వీర జవాన్లకు నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా మన సైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు రావత్‌.

విశాఖలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ ఐమ్యాక్స్ ధియేటర్‌లో బొల్లారం ఆర్మీ స్కూల్ విద్యార్థులు కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. కార్గిల్ యుద్దంలో భారత సైన్యం చేసిన పోరాటాలను గుర్తు చేసేలా నిర్వహించిన పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో కార్గిల్‌ దివస్‌ ఘనంగా నిర్వహించారు. కార్గిల్‌ యుద్ధంలో అమర జవానులు అసువులు బాసిన తీరును విద్యార్థులు కళ్లకు కట్టారు. కార్గిల్‌ వార్‌ జరిగి నేటితో 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ దేశవ్యాప్తంగా కార్గిల్‌ దివస్‌ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story