మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి - చంద్రబాబు

మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి - చంద్రబాబు

వైసీపీ నేతల దౌర్జన్యకాండపై మరోసారి నిప్పులు చెరిగారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వైసీపీ నాయకుల దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తలపై 285 దాడులు జరిగాయన్నారు. 65 ఆస్తుల్ని ధ్వంసం చేశారని, 11 భూకబ్జాలు చేశారన్నారు. 24 చోట్ల కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఏడు హత్యలు జరిగాయని ఆరోపించారు చంద్రబాబు.

వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలు, దాడుల్ని అడ్డుకుంటామన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశామన్నారాయన. టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు చంద్రబాబు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడదామంటే స్పీకర్ మైక్‌ కట్ చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. మంత్రి పేర్ని నాని ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు.

అటు.. పోలీసులు సైతం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు చంద్రబాబు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని గుర్తు చేశారాయన. రాజకీయ నేతలకే కాదు సామాన్య ప్రజలకు కూడా పోలీసులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ దాడుల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు.

రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ నాయకులకు భద్రత ఉపసంహరిచారని, అవసరమైన నేతలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని చంద్రబాబు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story