భారీ వర్షాలు.. వరదలో నిలిచిపోయిన మహాలక్ష్మి ఎక్స్ప్రెస్
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి..వర్షం ధాటికి రైల్వే పట్టాలపై వరద నిలవడంతో కోల్హాపూర్-ముంబయి మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది.ఉల్హాన్ సాగర్ వద్ద ఆగిన ఈ ట్రైన్లో దాదాపు 700 మంది ప్రయాణికులు ఉన్నారు. గత 48 గంటలుగా ఆ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పూర్తిగా నీటమునిగింది..
NDRF దళాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 500 మందిని కాపాడారు. స్థానిక పోలీసులు, రైల్వే సిబ్బంది, రైల్వే రక్షక దళాలు హెలికాప్టర్ల ద్వారా అక్కడికి చేరుకుని ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. అక్కడ వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆహారం, మంచినీటితోపాటు అవసరమైన మెడిసిన్ను అందుబాటులో ఉంచారు..ఘటనాస్థలంలో మూడు పడవలను కూడా ఏర్పాటు చేశారు.
మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో మొత్తం 9 మంది గర్భిణీలు ఉన్నట్లు గుర్తించారు..D1 కోచ్లో ఉన్న రేశ్మా తిలక్ అనే గర్భిణికి పురిటి నొప్పులు మొదలైనట్లు గుర్తించారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు..
రాత్రి నుంచి ట్రైన్ నిలిచిపోయినా.. ఎవరూ పట్టించుకోలేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోవడంతో రాత్రంతా జాగారం చేశామని...నరకం అనుభవించామని వాపోయారు. సమీపప్రాంతాల్లోని గ్రామస్తులే తమకు సాయం చేశారని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com