కన్నుల పండువగా కన్వర్ యాత్ర

కన్నుల పండువగా కన్వర్ యాత్ర

కన్వర్ యాత్రను ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీల్లో లక్షలాదిమంది భక్తులు కావడి యాత్రలో ఉత్సా హంగా పాల్గొంటున్నారు. బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ కన్వర్ యాత్ర కన్నులపండువగా సాగుతోంది.వేలాదిమంది భక్తులు కావడి మోసుకుంటూ ముందుకు సాగుతున్నారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

కావడి యాత్ర శివభక్తులకు సంబంధించినది. ఏటా శ్రావణమాసంలో ఈ వేడుక జరుపుకుంటారు. యాత్ర లో భాగంగా కావడి మోసుకుంటూ పరమశివుని దర్శనానికి వెళ్తారు. ప్రముఖ శైవక్షేత్రాలను దర్శించి గంగ మ్మలో పునీతమవుతారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లలో మహాశివునికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హరిద్వార్ పట్టణం కిక్కిరిసిపోతుం ది. గతంలో కోటి మంది భక్తులు రాగా, ఈసారి కోటిన్నరకు పైగా వస్తారని అంచనా. ఇప్పటికే ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు కావడి మోసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ హరిద్వార్‌కు చేరుకుంటున్నారు.

యాత్రలో పాల్గొనేవారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయి. కావడియాత్రికుల రక్షణ కోసం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కావడియాత్రికులు నడిచే రహదారుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. సహరాన్‌పూర్‌లో కావడి యాత్రికులపై పోలీసులు హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. ఢిల్లీలో ఎస్పీ అజయ్ కుమార్ ఒక కావడి యాత్రికుని కాళ్లు నొక్కారు.

Tags

Read MoreRead Less
Next Story