వ్యాపారిని కిడ్నాప్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు
హైదరాబాద్లో అర్థరాత్రి జరిగిన వ్యాపారి కిడ్నాప్ ఘటన అనేక అనుమాలకు తావిస్తోంది. దోమల్గూడకు చెందిన గజేందర్ పారక్ అనే వ్యాపారిని ఎత్తుకెళ్లిన దుండగులు.. 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. చివరికి కోటి రూపాయలకు బేరం కుదుర్చుకుని.. అబిడ్స్లో డబ్బులు తీసుకుని.. వదిలిపెట్టారు. కిడ్నాపర్ల దాడిలో గజేందర్ చెయ్యి విరగడంతో ప్రస్తుతం హైదర్గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దోమల్గూడలో గజేందర్ను కారులో ఎక్కించుకుని కళ్లకు గంతలు కట్టారు కిడ్నాపర్లు. ఆ తర్వాత దాదాపు 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. అక్కడ ఓ బిల్డింగ్ గదిలో కూర్చోబెట్టి.. మూడు కోట్లు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. చివరకు కోటి రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని గజేంద్ర తెలిపారు. రాత్రి రెండు గంటల తర్వాత అబిడ్స్ తీసుకొచ్చి... లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు కిడ్నాపర్లు. కోటి రూపాయలు ముట్టిన తర్వాత కిడ్నాపర్లు.. చిరాగ్ అలీ లేన్లో తనను వదిలిపెట్టారని గజేందర్ పోలీసులకు వివరించారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com