5వ తరగతి విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తున్న హెడ్‌మాస్టర్‌

5వ తరగతి విద్యార్థినిలను లైంగికంగా వేధిస్తున్న హెడ్‌మాస్టర్‌

గురువును ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. తల్లిదండ్రుల తరువాత అంతగా ఆరాధించేది గురువునే. కానీ ఆ గురువే పాడు పని చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఆ ఉపాధ్యాయుడే కామంతో కళ్లు మూసుకుపోయి భక్షిస్తే... విద్యార్థులకు రక్షణ ఎక్కడిది? గతంలో స్కూళ్లలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనలు మరిచిపోక ముందే... మరో రెండు స్కూళ్లలో టీచర్లు కీచకులుగా మారి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపుతోంది.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ప్రధానోపాధ్యాయుడు సుబ్బయ్య... 5వ తరగతి చదువుతున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్ధినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. హెడ్‌మాస్టర్‌ వేధింపులు భరించలేక సదరు బాలికలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో... అప్పటికే ఆ కీచక ఉపాధ్యాయుడు పారిపోయాడు. దీంతో అక్కడున్న మిగత ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అటు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. రాజీవ్‌ గాంధీ మున్సిపల్‌ ఉర్దూ పాఠశాలలో విద్యార్థినులను... అదే స్కూల్లో పని చేస్తున్న వ్యాయామ టీచర్‌ ఇలాహీ వేధిస్తున్నాడు. ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నానని చెప్పి విద్యార్థినులను పాఠశాలకు రప్పించుకున్న టీచర్‌..వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయున్ని చితకబాదారు. వేధింపులకు పాల్పడ్డ టీచర్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు అక్కడే బైటాయించి ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Tags

Read MoreRead Less
Next Story