హ్యాట్సాఫ్ అజాక్సీ.. కొండచరియల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన శునకం
తనది ఆ జాతి కాదు.. తనకు ఆ భాష రాదు. మనుషులుగా పుట్టి ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ఆలోంచించే మనుషులు ఉన్న నేటి యుగంలో తన జాతి కానీ తనకు సంబంధం లేని మూగ జీవాలు మాత్రం అపాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతున్నాయి. ఆపదలో ఉంటే నేను ఉన్నాను అంటున్నాయి. ఏ జన్మలో ఏ బంధమో ఆపదలో ఉన్నవాళ్ళను రక్షించడం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి. మనుషులకు అత్యంత విశ్వాస పాత్రులైన శునకాలు ఇలాంటి త్యాగాలకు ముందు వరసలో ఉంటాయి. తాజా సంఘటనతో అది మరోసారి నిరూపితమైంది. శిథిలాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని..సీఆర్పీఎఫ్కు చెందిన ఓ శునకం రక్షించింది. . కొండచరియలు మీదపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను అది కాపాడింది. జమ్మూ కశ్మీర్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారిలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రామ్బన్ జిల్లా లుధ్వాల్ గ్రామానికి చెందిన ప్రదీప్కుమార్ రోడ్డు పక్కన నడుస్తూ వెళుతున్న క్రమంలో ఓ భారీ కొండచరియ విరిగిపడింది. ప్రమాదాన్ని గ్రహించి అతను పరుగెత్తాడు. ఇంతలో మట్టిపెళ్లలు అతనిపై పడ్డాయి. ప్రమాదంలో ఉన్న అతన్ని గుర్తించిన 'అజాక్సీ' అనే శునకం అరవడం మెుదలుపెట్టింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సభ్యులు అతన్ని చూసి కొండచరియలను తొలిగించడంతో శిథిలాల కింద ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com