వర్షాలు, వరదలతో ఆ జిల్లాలో విష సర్పాల బెడద..
ఏపీలో జోరు వానలు..వరదలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపంలో ఉభయగోదావరి జిల్లాలోని ఏజెన్సీ, లంకలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి..ప్రజలు అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. చాలా ప్రాంతాల్లో అరటితోటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంకగ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాలకు వరద తాకిడి పెరిగింది. కూనవరం దగ్గర శబరి, గోదావరి నదులు పోటెత్తడంతో గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వి.ఆర్ పురం మండలంలో శ్రీరామగిరి, చింతరేవులపల్లి, వడ్డిగూడెం గ్రామాలకు వరదనీరు చేరుకుంది. వరద గుప్పెట్లో చిక్కుకున్న
పశ్చిమగోదావరి జిల్లాలోనూ గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మునిగిపోయింది. స్పిల్వే మీదుగా 2 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. కాఫర్ డ్యాం వద్ద వరద ప్రవాహం 28 మీటర్లకు చేరుకుంది. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు వారం రోజులుగా రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగుకు వరద చేరడంతో 14 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం నెలకొంది. ముంపు గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు లాంచీలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు.ప్రజలకు నిత్యావసర వస్తువులను అధికారులు లాంచీల్లో తరలిస్తున్నారు.
గోదావరి ఉప్పొంగడంతో..ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో కృష్ణా జిల్లాలో విష సర్పాల బెడద జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వరుసగా పాము కాటుతో జిల్లాలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది.
వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కాగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com