జమ్మూ కశ్మీర్ అంశంపై కేంద్రం నేడు కీలక ప్రకటన?
జమ్మూ కశ్మీర్లో క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయం మరింత వేడెక్కుతోంది. జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, వామపక్షాలు, పీడీపీ లోక్సభలో చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చాయి. మరోవైపు.. ప్రభుత్వం కూడా ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో కశ్మీర్ అంశంపై చర్చిస్తారని.. ప్రధానమంత్రి కేబినెట్ సహచరులకు స్పష్టత ఇస్తారని చెప్తున్నారు. అటు.. జమ్ముకశ్మీర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో హోంమంత్రి అమిత్షా ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇటు లోక్సభలో.. జమ్ముకశ్మీర్లో తీసుకున్న భద్రతా చర్యలపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు... జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నట్టు శివసేన ప్రకటన చేసింది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఈ విషయంపై ఎడిటోరియల్ ప్రచురించింది. అటు.. కాంగ్రెస్ మాత్రం ఎప్పట్లాగే మోదీ తీరును ఖండించింది. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా, ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధాలను కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం తప్పుపట్టారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం చర్యలు చేపడుతోందని అన్నారాయన. అటు.. జమ్ముకశ్మీర్ గవర్నర్ మాత్రం.. ఈ రాష్ట్రం విషయంలో ఏది చేసినా.. పార్లమెంట్ వేదికగానే.. ఓపెన్గా ఉంటుందని.. రహస్యంగా ఏమీ ఉండబోదంటూ ప్రకటన చేశారు. మరో రెండు రోజుల్లో అందరికీ స్పష్టత వస్తుందని స్పష్టంచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com