గర్భిణి ప్రసవం కోసం..
మన్యంలో వైద్యుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇలాంటి సమయంలో ముందస్తుగా గర్భిణులను వైద్యశాఖలకు తరలించడంలో అశ్రద్ధ వహిస్తున్నారు వైద్య సిబ్బంది. దీంతో అర్థరాత్రి సమయంలో పక్క ఊరు నుండి ANMలను పిలిపించి ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది..
తూర్పు మన్యంలోని చింతూరు మండలం కల్లేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత అనే గర్భిణి ప్రసవం కోసం చింతూరు ఆస్పత్రికి రాగా.. ప్రసవానికి ఇంకా సమయం ఉందని.. ఎవరైనా తెలిసినవాళ్ల ఇంటికి వెళ్లు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న సమయంలో గర్భిణిని ఇంటికి పంపించడతో సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే అర్థరాత్రి ఆమె ప్రసవ వేదనకు గురవ్వడంతో.. స్థానికులు పక్క ఊరిలో ఉన్న ANMకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆమె అంగన్ వాడీ కార్యకర్త సహాయంతో గర్భిణికి ప్రసవం చేశారు. అదృష్టం బాగుండి తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు..
వి.ఆర్.పురం మండలం రామవరం గ్రామానికి చెందిన ఓ గర్భిణి ప్రసవ సమయంలో ఇంటి దగ్గరే ఉందని తెలుసుకున్న యటపాక సీఐ హనీష్ బాబు మానవత్వం చూపించి.. బోటు సహాయంతో ఆ గ్రామానికి చేరుకుని గర్భిణిని ఆసుపత్రికి తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com