వీడని లక్ష్యం.. నెరవేరిన స్వప్నం.. కమలదళంలో ఉత్సాహం
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై ఆనందంతో ఉంది బీజేపీ. మరోవైపు సంఘ్ పరివార్ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలనుంచి కూడా మోదీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి జమ్ముకశ్మీర్ భారత్లో సంపూర్ణంగా విలీనమైందంటూ వేడుకలు జరుపుకుంటున్నారు
జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దుతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ సంపూర్ణంగా భారతలో విలీనమైందంటూ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రజలు చిరకాల కల నెరవేరడంతో కమలదళంలో ఉత్సాహం పరవళ్లు తొక్కు తోంది. సంఘ్ పరివార్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆసేతు హిమాచలం కాషాయ పరివారం సంబరాలు చేసుకుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో బీజేపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. ఇన్నేళ్లకు జమ్మూ కశ్మీర్ పూర్తిగా దేశంలో విలీనమైందంటూ నినాదాలు చేశారు.
మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో బీజేపీశ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. మోదీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించాయి. స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు కమలనాథులు. ఆర్టికల్-370 రద్దుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలిపారాయన. మోదీ సర్కారు నిర్ణయంపై బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ సమస్యకు ఇప్పటికైనా ముగింపు పలికారని ప్రశంసించాయి. మోదీ ఎంతో సాహసంతో ఈ చర్య తీసుకున్నారని కితాబిచ్చాయి.
పార్లమెంట్లోనూ ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఆర్టికల్-370 రద్దు ప్రకటన రావడం, జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో పార్లమెంట్ వెలిగిపోయింది. విద్యుత్ దీప కాంతుల్లో పార్లమెంట్ మిలమిలా మెరిసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం సంబరాలు జరుపుకున్నారు. మోదీ సర్కారు నిర్ణయాన్ని ప్రశంసించాయి. . జమ్మూకశ్మీర్లో ఇప్పటికైనా పూర్తిస్థాయిలో శాంతి నెలకొంటుందని ఆకాంక్షించారు. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజిస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం.... అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com