బీజేపీ ఎంపీ స్పీచ్కి ప్రధాని ఫిదా!
తన మాటల తూటాలతో, పొలిటికల్ పంచ్ లతో, కవితలతో అదరహో అనిపించారు లడఖ్ బీజేపీ ఎంపీ సేరింగ్ నమగ్యాల్. ఆయన ప్రసంగానికి..... సభ్యుల చప్పట్లు కూడా తోడు కావడంతో .. లోక్ సభ మార్మోగింది. కశ్మీరుతో కలిసి ఉండాలని లడఖ్ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదన్నారాయన. ఆర్టికల్ 370 వల్ల కేవలం రెండు కుటుంబాలు, మూడు పార్టీలు మాత్రమే లాభపడ్డాయంటూ పంచ్ డైలాగులు పేల్చారు. అతని ప్రసంగానికి ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ నేతలంతా ఫిదా అయ్యారు.
జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లడక్ బీజేపీ ఎంపీ సేరింగ్ నమగ్యాల్ చేసిన ప్రసంగానికి..... సభలో చప్పట్టు మార్మోగిపోయాయి. లడఖ్ కు కేంద్ర పాలిత ప్రాంత హోదా కోసం ఇక్కడి ప్రజలు 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారాయన. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
ఒకే దేశం, ఒకే జెండా,ఒకే రాజ్యాంగం అంటూ తమ పార్టీ చేస్తున్న కృషికి తాను గర్విస్తుస్తున్నానన్నారు సేరింగ్ నమగ్యాల్. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్ సభ, రాజ్యసభలలో కాంగ్రెస్, పీడీపీ పార్టీల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్గిల్ గురించి వారికి ఏం తెలుసునంటూ నిలదీశారు. జమ్ముకశ్మీర్ లో యూనిటీ ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు.....
జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 వల్ల లడఖ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. జమ్ముకశ్మీర్ పాలనలో లడఖ్ ప్రజలు అభివృద్ధిని చూడలేదన్న ఆయన... . తమ పోరాటాలను గానీ తమ హక్కుల గురించి గానీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.... నమగ్యాల్ ప్రసంగానికి ప్రధాని మోదీ కూడా ఫిదా అయ్యారు. జమ్ముకశ్మీర్ కు చెందిన కీలక బిల్లుపై చర్చిస్తున్న సమయంలో తన యువ స్నేహితుడు నమగ్యాల్ అద్భుతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని కొనియాడారు. లడఖ్ లోని తమ సోదరసోదరీమణుల ఆకాంక్షలను ప్రతి ఫలించేలా నమగ్యాల్ ప్రసంగించారని, తప్పకుండా వినాల్సిన ప్రసంగం ఇది అని మోదీ కొనియాడారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com