బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన మహిళ.. పరారీలో ప్రియుడు
ప్రేమించానని వెంట పడితే నమ్మింది. పెళ్లి చేసుకుంటానని ఒట్టేస్తే నిజమేననుకుంది. తీరా గర్భం దాల్చాక ఆ ప్రియుడి నిజరూపం బయటపడింది. నెలలు నిండాక పురుటి నొప్పులతో అల్లాడుతున్నా ఆమెను ఆసుపత్రులన్నీ తిప్పాడు. కాలయాపన కావడంతో ఆ మహిళ మగశిశువుకు జన్మనిచ్చి తనువుచాలించింది. ఇదంతా తన మెడకు చుట్టుకుటుందని ఆ ప్రియుడు పరారయ్యాడు. విశేషమేమిటంటే ప్రియుడు సజన్లాల్ హోమ్గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
బాధితురాలు అరుణది కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దంపూర్ గ్రామం. ఆసిఫాబాద్ హెడ్క్వార్టర్స్లో హోమ్గార్డ్ విధులు నిర్వహిస్తున్న సజన్లాల్ ఓ ఏడాదిగా ప్రేమిస్తున్నానంటూ అరుణను శారీరకంగా వాడుకున్నాడు. మహిళ కుటుంబ సభ్యులు ప్రశ్నించినా.. తాను పెళ్లిచేసుకుంటానని చెప్పాడు.
పురుటి నొప్పులు వస్తున్నాయని సజన్లాల్కి సమాచారం ఇవ్వడంతో తన వద్ద డబ్బులు లేవని మహిళను ప్రభుత్వ ఆసుపత్రి వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత డబ్బులతో తిరిగివచ్చి మంచిర్యాల్, ఆదిలాబాద్ అంటూ ఆసుపత్రులకు తిప్పుతూ కాలయాపన చేశాడు. ఆదిలాబాద్ రిమ్స్ వెళ్లే మార్గంలో నొప్పులు ఎక్కువై ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చి చనిపోయింది. ఆ తర్వాత అరుణ శవాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పెట్టి సజన్లాల్ పరారయ్యాడు. సజన్లాల్ పథకం ప్రకారమే అరుణ చనిపోయేలా చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com