చంద్రబాబు తీర్మానంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి: ముద్రగడ

చంద్రబాబు తీర్మానంపై  సానుకూల నిర్ణయం తీసుకోవాలి: ముద్రగడ

కాపు కోటా కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం. బ్రిటిష్ వారి హయాంలో బలిజ, తెలగ, ఒంటరి, కాపు వర్గాలు బీసీ రిజర్వేషన్లు అనుభవించేవని తెలిపారు. 1956లో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆ రిజర్వేషన్లు తొలగించగా... 61 లో పునరుద్ధరించారని.. 64లో కాసు బ్రహ్మానందరెడ్డి రిజర్వేషన్లు రద్దు చేశారని చరిత్రను గుర్తుచేశారు. 2017 డిసెంబర్ 2న మా జాతికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ BC-F కేటగిరీలో చేరుస్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి.. గవర్నర్ ఆమోదంతో... కేంద్ర హోంశాఖకు పంపారని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆ తీర్మానంపై పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని ముద్రగడ పద్మనాభం మోదీని కోరారు.

కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడి తరగతుల్లో చేర్చాలని కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్నారు ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం ఆధారంగా తమకు 5శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ లేఖ రాశారు. అందులో చంద్రబాబు ప్రయత్నాన్ని ప్రస్తావించారు తప్పితే... ప్రస్తుత జగన్‌ సర్కార్‌ మాటను చేర్చలేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు.. అధికారంలోకి రాగానే కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. తర్వాత BC-F కేటగిరీ చేర్చి.. 5 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం కేంద్రానికి పంపారనే విషయాన్ని ముద్రగడ పద్మనాభం తన లేఖలో ప్రస్తావించారు. కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం... కాపు కోటాను రద్దు చేసింది. అమలు సాధ్యం కాదంటూ.. ఓ కమిటీ వేసింది. కాపుల విషయంలో ప్రస్తుత జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ముద్రగడ ఏమాత్రం ప్రస్తావించలేదు.

Tags

Read MoreRead Less
Next Story