మాజీ సీఎం కుమారస్వామికి కొత్త తలనొప్పి..
కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వివాదం కలకలం రేపుతోంది. కుమారస్వామి ప్రభుత్వం హయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని అనర్హత వేటు పడిన విశ్వనాథ్ అనే ఎమ్మెల్యే ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్తో పాటు మరో బీజేపీ ఎమ్మెల్యే అశోక తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరు నెలల కిందటే ఆరోపించినట్లుగా ఆయన గుర్తుచేశారు. కేవలం తమనే కాదని, క్లర్కులతో పాటు అధికారులు, మరికొందరి జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన బాంబు పేల్చారు. దీనిపై ఈ ట్యాపింగ్ వ్యవహారంపై యడియూరప్ప ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లోని ఏడీజీపి ర్యాంక్కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి కొందరు ఇన్స్పెక్టర్ల సాయంతో దాదాపు 185 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ నేతలతో పాటు జర్నలిస్ట్లు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ఈ టీం ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వీరి ప్రైవేట్ సంభాషణలను రికార్డు చేశారని, ఈ సమాచారాన్ని పెన్ డ్రైవ్లో తీసుకున్నారని, దీనిని ఏడీజీపీ ర్యాంక్ ఆఫీసర్కు ఇచ్చినట్లు వెల్లడి కావడం కలకలం రేపుతోంది.
లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు, జర్నలిస్ట్లు, పోలీసుల అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్ ట్యాప్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్ భాస్కర్రావుకు ఆ రాష్ట్ర డీజీపీ నీలమణి రాజు ఆదేశించారు. రాజకీయ కారణాలతోనే ఫోన్లను ట్యాపింగ్ చేశారంటున్నారు బీజేపీ నేతలు. కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మండిపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరమంటున్న బీజేపీ నేతలు.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణల్ని జేడీఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కుమారస్వామి ఎప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించలేదంటున్నారు. మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ ఎపిసోడ్పై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు.. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని తాను ముందు నుంచే చెప్పానని కుమారస్వామి అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com