వైద్యుడే దేవుడయ్యాడు.. 6 కి.మీ బాలింతను మోసుకుంటూ..
వైద్యుడ్ని దేవుడిగా కొలిచే మన దేశంలో ఆ మాటను నిజం చేశాడు ఓ వైద్యుడు. రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన బాలింతను ఆమె భర్త సహాయంతో ఏకంగా 6 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఓ మంచానికి రెండు వైపులా తాళ్లు కట్టి మహిళతోపాటు పిల్లలను మంచంపై పడుకోపెట్టి భర్తతోపాటు డాక్టర్ తీసుకెళ్లాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాళ్లచెలక గిరిజన గ్రామంలో జరిగింది.
మెడికల్ క్యాంప్లో భాగంగా ఏజెన్సీకి వెళ్లిన డాక్టర్ రాంబాబుకు అప్పుడే ప్రసవించిన బాలింత సక్కు కనిపించింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చి తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నట్టు డాక్టర్ గుర్తించాడు. తల్లీబిడ్డల ప్రాణానికి ప్రమాదం ఉందని చలించిపోయాడు. కానీ దట్టమైన అడవిలో ఉన్న ఈ గ్రామానికి రవాణా వ్యవస్థ లేదు. అయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె భర్తతో కలిసి ధైర్యం చేశాడు. రాళ్లు రప్పలూ దాటుకుంటూ భుజాలు నొప్పి పెడుతున్నా అలా రోగిని మోస్తూ వైద్యుడిగా కర్తవ్యాన్ని నెరవేర్చాడు.
అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ 6 కిలోమీటర్లు నడిచాక మావిళ్లగూడెం తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108లో పాల్వంచకు తీసుకెళ్లినా సరైన వైద్య సేవలు లేకపోవడంతో భద్రాచలం తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. భగవంతుడు జన్మనిస్తే, వైద్యు పునర్జన్మనిస్తాడని అంటారు. ఓ రోగి కోసం వైద్యుడు పడిన ఆరాటం అందరినీ కలిచివేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com