పాకిస్థాన్ కు వణుకు పుట్టించే సందేశం పంపిన రాజ్‌నాధ్ సింగ్

పాకిస్థాన్ కు వణుకు పుట్టించే సందేశం పంపిన రాజ్‌నాధ్ సింగ్

భారత్ మారిపోతోంది. అవును. భారత్ తీరు మారుతోంది. విధానాలు మారుతున్నాయి. ఇప్పటికే విదేశాంగ విధానాలను మార్చుకున్న మన దేశం ఇక ఇప్పుడు రక్షణ విషయంలోనూ సరికొత్త పంథా అనుసరిస్తోంది. దెబ్బకు దెబ్బ అనే పాత సిద్ధాంతం నుంచి మొదటి దెబ్బ మనదే కావాలనే కొత్త ఒరవడిని అలవర్చుకునే దిశగా పయనిస్తోంది.

స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ ప్రతీసారి సహనాన్నే ప్రదర్శించింది. బార్డర్లో బుల్లెట్లు పేల్చినా.. దేశంలోనే ఉగ్రవాదాన్ని ఎగదోసినా శాంతి జపాన్ని వినిపించింది. కానీ, మోదీ ఎంట్రీతో మొత్తం కాన్సెప్ట్ మారిపోయింది. రక్షణాత్మక ధోరణి కాదు.. ఎదురుదాడి.. ఇంకా కుదిరితే మనదే ముందు దెబ్బ కావాలనే ఐడియాలజీ కనబరుస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ ఉగ్రశిబిరాలపై ఎయిర్ స్ట్రైక్స్ తో పాక్ కు మైండ్ బ్లాంక్ చేసింది.

జమ్మూలో ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ అతిగా స్పందిస్తోంది. మన దేశ అంతర్గత విషయాలపై ఉడికిపోతూ అడ్డగోలు వార్నింగ్ లు ఇస్తోంది. పుల్వామా దాడులు మరిన్ని జరగొచ్చు అంటూ పాక్ తమ ఉద్దేశాన్ని పరోక్షంగా వెల్లడిస్తోంది. అటు లద్దాఖ్ దగ్గర యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్.. పాక్ కు వెన్నులో వణుకు పుట్టేలా ఓ ఘాటు సందేశం పంపించారు. అణ్వస్త్రాల వినియోగంలో నో ఫస్ట్ యూజ్ పాలసీకి కట్టుబడి ఉండడం పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పాక్ గుండెల్లో బాంబ్ పేల్చారు రాజ్ నాథ్ సింగ్.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ తొలి వర్ధంతి సందర్భంగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో పర్యటించిన రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో దౌత్యపరంగా చిక్కుల్లో పడకుండా ఇప్పటివరకైతే అణ్వస్త్రాలను మొదటగా ప్రయోగించకూడదన్నదే తమ విధానమని స్పష్టం చేశారు రాజ్‌నాధ్. అలా అని భవిష్యత్తులో కూడా అదే విధానానికి కట్టుబడి ఉంటామని చెప్ప లేమన్నారు. 1998లో వాజ్‌పేయ్ హయాంలో 5 అణు పరీక్షల ను పోఖ్రాన్‌లోనే నిర్వహించారు. అప్పుడే నో ఫస్ట్ యూజ్ పాలసీని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇప్పుడు అదే వేదిక నుంచి పాకిస్థాన్‌కు బెదురుపుట్టించేలా రాజ్‌నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story