రెండేళ్ల పాపకు చాక్లెట్ల ఆశ చూపించి..
రెండేళ్ల చిన్నారి కిడ్నాప్ మిస్టరీ వీడింది. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని గగన్పహాడ్లో గురువారం సాయంత్రం జరిగిన కిడ్నాప్ కేసును ఆర్జీఐఏ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. గురువారం తెల్లవారుజాము 3 గంటలకే కేటుగాడిని అరెస్టు చేశారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
యూపీకి చెందిన షీరా, అజయ్ల చిన్న కూతురు నైనా సాయంత్రం ఆడుకుంటూ వీధి వాకిట్లోకి వచ్చింది. ఇదే అదునుగా పాపను మాటల్లో పెట్టి, చాక్లెట్ల ఆశ చూపించి కిడ్నాపర్ ఎత్తుకుపోయాడు. పాప చెయ్యి పట్టుకుని తీసుకెళ్లడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కూతురు కిడ్నాప్ విషయం తెలిసిన తల్లి స్ఫృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను బంధువులు ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన రంగంలోకి దిగారు.
పాపను ఎత్తుకెళ్లింది ఎవరనే దానిపై పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. నిందితుడు కాలనీలోకి ఈ కుటుంబాన్నే టార్గెట్గా చేసుకుని వచ్చాడా లేదంటే.. పిల్లల్ని ఎత్తుకు పోయే గ్యాంగ్లో సభ్యుడా అనే దానిపై కూడా ఆరా తీశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి పాపను కాపాడారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com