వివాహేతర సంబంధం : భార్యను హత్యచేయించిన భర్త

వివాహేతర సంబంధం : భార్యను హత్యచేయించిన భర్త

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో భార్యను హత్యచేయించాడో భర్త.. ఈ ఘటన మెదక్‌ జిల్లా ఔరంగాబాద్‌ తండాలో చోటు చేసుకుంది.. తండాకు చెందిన కేతవత్‌ విజయ, దేవుల దంపతులు. కూలీపనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం సాఫీగానే సాగింది వీరి కాపురం. దేవుల తన భార్యను తీసుకొని కూలికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో ఆమె కొద్దిరోజులుగా పనికి రానని మొండికేసింది. దీంతో అనుమానం చెందిన దేవుల.. భార్య ఇంటివద్దే ఉంటూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందని గుర్తించాడు. దీనిపై పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. వినకపోవడంతో కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు.. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దేవుల కూడా ప్రియుడి సహాయంతో భార్య తనను ఏమైనా చేస్తుందేమోనని భయపడ్డాడు. దీంతో ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పధకం వేశాడు. ఇందులో భాగంగా రూప్‌సింగ్‌ అనే వ్యక్తికి రూ.10వేలు సుపారీ ఇచ్చి తన భార్యను హత్య చేయాలనీ కోరాడు.

ఇందుకోసం రూప్‌సింగ్‌ తన బావమరిది మదన్ సహాయం తీసుకున్నాడు. రూప్‌సింగ్‌, మదన్ కలిసి విజయను ఈ నెల 17న సినిమాక్స్‌లో రణరంగం సినిమా చూపించారు. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో మెదక్‌లో మద్యం కొనుగోలు చేసి అవుసులపల్లి శివారులోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ రూప్‌సింగ్, మధన్‌లు విజయకు మద్యం తాగించి అత్యాచారం చేసి, ఆపై ఆమె చీరతో గొంతు నులిమి చంపేశారు. ఇటు దేవుల ఎప్పటికప్పుడు సమాచారాన్నంతా ఫోన్ లో తెలుసుకుంటున్నాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాకా.. తన భార్య రాత్రి అయినా కూడా ఇంకా ఇంటికి రాలేదని వగలమారి ఏడుపు ఏడ్చాడు. విజయ బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తుండగా.. వారికి అవుసులపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో విజయం మృతదేహం లభ్యమైంది. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య విషయం బయటపెట్టాడు దేవుల. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story