ఆచరణలో కనిపించని వాలంటీర్ల వ్యవస్థ..

ఆచరణలో కనిపించని వాలంటీర్ల వ్యవస్థ..

ఏపీలో రేషన్‌ కార్డుల కోసం EKYC తప్పనిసరి కావడంతో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద జనం బారులు తీరుతున్నారు. ప్రజాసాధికార సర్వేలో నమెదుకాని వారి కోసం EKYC చేపట్టడంతో ఈసేవ కేంద్రాలతో పాటు బ్యాంకుల్లో సైతం రద్దీ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 2 వేల 23 రేషన్ డిపోలు ఉండగా, EKYC నమోదు చేయించుకోవాల్సిన వారు 4 లక్షల 50 వేల మందికి పైగా ఉన్నారు. పిల్లలు మొదలు, పండు ముసలి వరకు గంటల తరబడి నమోదు కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నమోదు కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. పిల్లలకు వేలి ముద్రలు పడకపోవడంతో వారందరినీ స్కూళ్లు మానిపించి నమెదు కేంద్రాలకు తీసుకొస్తున్నారు.

గతంలో.. పల్స్ సర్వేను రేషన్ దుకాణాలకు అనుంధానం చేయటం జరిగింది. దీంతో ప్రతి గ్రామంలోనూ ఆయా కేంధ్రాల వద్దకు ప్రజలు వెళ్లి నమెదు చేసుకున్నారు. తీరా ఇప్పుడు బ్యాంకులు, ప్రధాన పోస్ట్ ఆఫీసులు నమోదు కేంద్రాలుగా మారడంతో పనులు మానుకొని ప్రజలు పట్టణాలకు రావాల్సి వస్తోంది. ప్రజల వద్దకే సంక్షేమ పథకాలని, వాలంటీర్ల వ్యవస్థని చెప్పిన ప్రభుత్వం మాటలు ఆచరణలో కనిపించడంలేదు. దీంతో గంటల కొద్దీ వేచి ఉన్నా పని జరగటం లేదని మండిపడుతున్నారు.

విజయనగరంలోని మీసేవ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు. నెల రోజులుకు సరిపడా 17 వందల అప్లికేషన్లు పంపిణీ చేయగా.. వాటి కోసం వేలాది మంది రావడంతో తోపులాట చోటు చేసుకుంది. చంటి పిల్లలతో కేంద్రాల వద్దకు వచ్చిన మహిళలు, వృద్ధుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొన్ని పోస్టాఫీసుల వద్ద జనం రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. తెల్లారితో రష్‌ పెరుగుతుందని ఇక్కడే దుప్పట్లు తెచ్చుకుని పడుకుంటున్నారు.

EKYC నమోదు గడువు ముగుస్తుండడంతో ప్రజల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. అటు సర్వర్లు మొరాయిస్తున్నాయి. చాలామంది పిల్లలు, వృద్ధుల వేలిముద్రలు సరిపోవడం లేదు. ఒక్కొక్కరికి కనీసం అరగంట పడుతోంది. పనులు మానుకుని మరీ లైన్లలో పడిగాపులుకాస్తున్నారు. రోజంతా నమోదు కేంద్రాల వద్ద గడిపినా... పని అవుతుందో లేదో తెలీక జనం ఆందోళన పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story