రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. అనుమానంతో యువతిని..
ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమిస్తూనే వేరే అబ్బాయితోనూ చనువుగా మాట్లాడుతోందన్న అనుమానంతో యువతిని దారుణంగా హత్య చేశాడు. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తేజస్వినిని చంపేశాక తనకేమీ తెలియనట్టు హాస్టల్కి వెళ్లిపోయిన నితిన్.. చివరికి తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. పెనుబల్లి మండలం కూపెనకుంట్ల గ్రామంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. తేజస్విని- నితిన్ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసి గతంలోనే వారిని మందలించారు. ఐతే.. ఆదివారం తనతో మాట్లాడాలని పిలిచిన నితిన్ పథకం ప్రకారం హత్య చేశాడు. ముందుగా కొత్త లంకపల్లి గ్రామానికి బైక్పై తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తేజస్విని చెప్పేది వినకుండా పగతో రగిలిపోయి దారుణానికి ఒడిగట్టాడు.
పెనుబల్లిలో డిప్లొమా చదువుతున్నప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. డిప్లొమా పూర్తయ్యాక ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నితిన్. తనను మోసం చేస్తుందని అనుమానంతో పగ పెంచుకుని ప్రేమించిన యువతి ప్రాణం తీశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com