సింధు.. దేశం గర్వపడేలా చేసింది: మోదీ
భారత స్టార్ షట్లర్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు.. ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న తన ఆనందాన్ని ప్రధానితో పంచుకున్నారు. బంగారు పతకాన్ని సింధు ప్రధానికి చూపించారు. మోదీ మెడల్ను సింధు మెడలో వేశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్లో సింధు బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిందని మోదీ ప్రశంసించారు. ఆమెను కలవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ కంటే ముందు సింధు... క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుతో భేటీ అయ్యారు. సింధును కేంద్ర మంత్రి అభినందించారు. రిజుజుతో పాటు సీనియర్ కోచ్ గోపీచంద్, కోచ్ కిమ్ జి హ్యూన్ తో కలిసి సింధు ప్రధానిని కలుసుకున్నారు. గత ఆదివారం జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు... జపాన్ కు చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను చిత్తు చేసింది. కేవలం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించింది. 21-7,21-7 తేడాతో విజయం సాధించి, విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఇవాళ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో సింధుకు ఘనస్వాగతం లభించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com