నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం..
ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ భేటీలో కశ్మీర్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాలు ప్రకటించారు. అందుకే... కశ్మీరీ యువతకు ప్రత్యేక ఉద్యోగాలతోపాటు, కశ్మీర్, లద్దాఖ్ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను అందించేందుకుగాను ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం.
ప్రత్యేక ప్యాకేజీతో కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది. జమ్మూకశ్మీర్లో పరిశ్రమలు, కొత్త యూనివర్శిటీలు ఏర్పాటుపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా వెనకబాటుతనంతో ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న యువతను కేంద్రం టార్గెట్ చేసింది. ఉద్యోగాలు లేకపోవడం వల్లే.. వీరంతా టెర్రరిస్టులుగా మారుతున్నారంటున్న కేంద్రం.. అక్కడ భారీ ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. క్యాబినెట్లో ప్రధానంగా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ఆర్మీ, పారామిలటరీ, పోలీస్ దళాల్లో భారీగా రిక్రూట్మెంట్లు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈఎస్ఐ చందాదారులకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ఆసుపత్రిని నిర్మించాలని కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదించింది. దీంతో పాటు విద్యాహక్కు చట్టం అమలు కోసం కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు, రాయితీలు అందించేందుకు వీలుగా ఆధార్ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ కేబినెట్లో వీటిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com