గుళ్లో పాములు.. భయంతో భక్తులు

శివుని సన్నిధి శ్రీశైలం. నిత్యం వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతుంటుంది. హరహరమహాదేవుడి సందర్శనార్థం భక్తులు ఆలయానికి విచ్చేస్తుంటారు. శ్రీశైలం చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉంటాయి. దాంతో పాములు, పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల గర్భాలయ సమీపంలో, పరిసర ప్రాంతాల్లో, దేవస్థాన స్టాఫ్ క్వార్టర్స్లో, వసతి కేంద్రాల వద్ద పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలయంలో పాములు కనిపించడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే పాము కనిపించిన
ప్రతిసారి శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలోని సున్నిపెంట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించ వలసి వస్తుంది. స్నేక్ క్యాచర్ వచ్చేదాక వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండ్రోజుల క్రితం కూడా ఆలయంలోకి పాము వచ్చినట్లు సమాచారం. అటవీ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లను దేవస్థానం నియమించుకుంటే పాము కనిపించిన వెంటనే వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని భక్తులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com