కష్టాల్లో డీకే శివకుమార్.. హైకోర్టులో చుక్కెదురు..
కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ దాదాపు నాలుగున్న గంటల పాటు ప్రశ్నించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఇవాళ మరోసారి విచారణకు హజరుకావాలని ఆదేశించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న డీకే శివకుమార్ ను తన నివాసంలో దొరికిన సొమ్ము వివరాలపై ఆరా తీశారు అధికారులు. నోటీసులు ఇవ్వగానే హడావుడిగా విచారణ ప్రారంభించటాన్ని తప్పుబడుతూనే.. ఈడీకి తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు డీకే శివకుమార్.
ఈడీ విచారణకు హజరయ్యే ముందు.. అరెస్టూ చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై ఓవైపు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తూనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన డీకే... తొలుత కర్ణాటక భవన్కు, ఆ తర్వాత తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఈడీ ఆఫీస్ కు వెళ్లిన డీకే.. తాను ఎలాంటి అత్యాచారం గానీ, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న శివకుమార్... చట్టాన్ని గౌరవించి ఈడీ అధికారులకు సహకరిస్తానన్నారు.
ఏడాదిన్నర క్రితం... ఢిల్లీలోని శివకుమార్ నివాసంలో 8 కోట్ల 59లక్షల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పన్ను ఎగవేత, హవాలా బదిలీల ఆరోపణల కింద 2018 సెప్టెంబరులో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇటీవల దర్యాప్తునకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను సవాల్ చేస్తూ శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com