పాకిస్థాన్‌లో సిక్కు యువతి మతమార్పిడి వ్యవహారంలో మరో మలుపు

పాకిస్థాన్‌లో సిక్కు యువతి మతమార్పిడి వ్యవహారంలో మరో మలుపు

పాకిస్థాన్‌లో సిక్కు యువతి మతమార్పిడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పంజాబీ యువతి మతమార్పిడి విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో మాయ చేయాలని చూస్తోంది. తప్పుడు ప్రచారంతో యువతి కుటుంబసభ్యులతో పాటు మనదేశాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు నిందితులను అరెస్టు చేశారని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పేర్కొంది. యువతిని, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారని తెలిపింది. ఐతే, ఇదంతా తప్పుడు ప్రచారమని బాధితురాలి కుటుంబం స్పష్టం చేసింది. తమ అమ్మాయి ఇంకా ఇంటికి చేరలేదని తెలిపింది. తన సోదరి గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని, ఆమెను తమకు అప్పగించలేదని బాధితురాలి సోదరుడు చెప్పాడు.

లాహోర్‌కు చెందిన సిక్కు యువతి జగ్జీత్ కౌర్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా మతం మార్చి ముస్లిం యువకునితో పెళ్లి చేశారు. ఇదిలా ఉంటే, యువతి తండ్రి తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఓ వీడియో బయటికి వచ్చింది. తన పేరు జగ్జీత్‌ కౌర్‌ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతం లేదని చెప్పుకొచ్చింది. వీడియోలో ముస్లిం భర్త ఆమె పక్కనే ఉన్నాడు. ఆ వీడియో చూసిన యువతి తండ్రి, తన కుమార్తెను కిడ్నాప్ చేసి మతం మార్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే, పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. దాంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు లేఖ రాశారు. ఆయన‌ కూడా సిక్కు కుటుంబం గోడు పట్టించుకోలేదు.

యువతి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాకిస్తాన్‌లోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. సిక్కు యువతి విషయంలో పాక్ ప్రభుత్వం దొంగ వేషాలు వేస్తోందని మండిపడింది. పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. యువతిని విడిపించడానికి చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాక్‌లోని మైనార్టీలతో పాటు భారత ప్రజలు తీవ్రంగా స్పందించడంతో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరింత నష్టం జరగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఐతే, ఇదంతా ఉత్త డ్రామా అని బయటపడింది. నిందితులను పట్టుకున్నామని, బాధితురాలిని విడిపించామని పాక్ పోలీసులు నాటాకాలాడారు. ఐతే, సిక్కు యువతి ఇంకా ఇంటికి చేరలేదని బాధిత కుటుంబం చెప్పడంతో పాక్ దుష్ట బుద్ది బయటపడింది.

మరోవైపు, జగ్జీత్‌ కౌర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకున్న యువకుడెవరో తెలిసిపోయింది. ఆ ముస్లిం యువకునికి ఉగ్రవాదులతో పరిచయాలున్నట్లుగా గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్‌ సయీద్‌కు చెందిన జమాతే ఉద్దైవాతో అతనికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story