సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

సంచలనం రేపిన కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ మర్డర్‌ కేసు ఓ కొలిక్కి వస్తోంది. సతీష్‌ను మర్డర్‌ చేసిన క్లోజ్‌ ఫ్రెండ్‌ హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్‌ లవర్‌ అయిన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో సతీష్‌ చనువుగా ఉండడంతోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం హైదరాబాద్‌ విడిచివెళ్లిన హేమంత్‌.. మూడు రోజులుగా ఒకే చోట షెల్టర్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

సతీష్‌, హేమంత్‌ ఇద్దరూ బాల్యస్నేహితులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. సతీష్‌ కంపెనీ పెట్టి హేమంత్‌ను పార్ట్‌నర్‌గా చేర్చుకున్నాడు. అయితే ఆర్థిక విషయాల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నెల 28న ఆఫీస్‌కు వెళ్లిన సతీష్‌ అదేరోజు.. రాత్రి 10 గంటలకు ఇంటికొస్తున్నట్లు భార్యకు ఫోన్‌ చేశాడు. కానీ తెల్లవారినా ఇంటికి రాక పోవడం, అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో భార్య ప్రశాంతి అతని స్నేహితుల వద్ద విచారించింది. ఆచూకీ లభించక పోవడంతో 29న కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో హేమంత్‌కు ప్రశాంతి ఫోన్‌ చేసింది. అతడి ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆమె… కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఆఫీస్‌కు వెళ్లింది. హేమంత్‌ అడ్రస్‌ తెలుసుకుని అతని ఇంటికి వెళ్లింది. హేమంత్‌ ఇంటికి తాళం వేసి ఉండడం, ఇంట్లోంచి దుర్గంధం వస్తుండడంతో అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారమిచ్చింది. కాలనీ వాసుల సమక్షంలో ఇంటి తాళాలు పగుల గొట్టి చూడగా సతీష్‌.. శవమై కనిపించాడు. సతీష్‌ను పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది.

వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. పథకం ప్రకారమే సతీష్‌ను ఇంటికి పిలిచి హేమంత్‌ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హేమంత్‌ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంకను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హేమంత్, సతీష్‌ మధ్య ఆర్థికపరమైన గొడవలున్నట్లు ప్రియాంక వాంగ్మూలం ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story