వారి ఆత్మహత్యకు కారణం అదేనా ?
అమలాపురంలో డాక్టర్ కృష్ణంరాజు ఫ్యామిలీ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. డాక్టర్ కుటుంబం చనిపోవడానికి కాల్మనీయే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుల బాధతోనే వారు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మూడేళ్ల వరకు డాక్టర్ కృష్ణం రాజు కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేవు. ఇద్దరు కుమారులను డాక్టర్లను చేయాలన్న కల నేరవేర్చుకున్నారు. పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ పూర్తిచేయగా, చిన్న కుమారుడు ఎంబీబీస్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే.. కొంతకాలంగా.. కృష్ణంరాజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఇందులో విపరీతంగా నష్టపోయాడు. దీంతో బ్యాంకుల నుంచి, ఫైనాన్స్ వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చాడు. ఈ డబ్బులు చెల్లించాలంటూ నెలరోజులుగా వడ్డీ వ్యాపారులు ఆయన ఇంటి చుట్టు తిరుగుతున్నారు. ఆస్తులు జప్తు చేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్తుల్ని, ఆసుపత్రుల్ని సైతం అమ్మకానికి పెట్టాడు కృష్ణంరాజు.
అయితే... వడ్డీ వ్యాపారుల బెదిరింపులు ఎక్కువ కావడంతో.. మనస్థాపానికి గురై భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు కృష్ణంరాజు. చిన్నకుమారుడు వంశీకృష్ణను సైతం రావాలంటూ ఫోన్ చేశాడు. ఆ సంభాషణలో కుమారుడుతో తన బాధలను చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తండ్రి కష్టాన్ని విన్న వంశీకృష్ణ తండ్రికి ధైర్యం చెప్పాడు. కానీ ఇంతలోనే ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. వడ్డీవ్యాపారుల వేధింపువల్లే చనిపోయారంటున్నారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com