పెళ్లి నుంచి తప్పించుకునేందుకు యువకుడు చేసిన పని..
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రవీణ్ అనే యువకుడి కిడ్నాప్ డ్రామా కలకలం సృష్టించింది. లండన్ నుంచి వచ్చిన తనను క్యాబ్డ్రైవర్ కిడ్నాప్ చేశాడంటూ.. తండ్రికి ఫోన్ చేశాడు ప్రవీణ్. తన దగ్గరున్న రెండు లక్షల కరెన్సీతో పాటు బంగారం ఎత్తుకెళ్లినట్లు తండ్రికి ఫోన్లో చెప్పాడు. తాను గుర్తుతెలియని ప్రదేశంలో ఉన్నానని, తనను రక్షించాలని వేడుకున్నాడు. కుమారుడి ఫోన్తో కంగారు పడిన తండ్రి శేషగిరిరావు.. హుటాహుటిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు ప్రవీణ్ కోసం.. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ప్రవీణ్ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు గుర్తించారు. దీంతో పాటు దర్యాప్తులో పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటికి వచ్చాయి. పెళ్లి ఇష్టం లేకనే ప్రవీణ్ ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు నిర్ధారించారు పోలీసులు. అంతేకాదు.. ప్రవీణ్ అసలు లండన్కే వెళ్లలేదని, చెన్నైలోనే ఉండి.. లండన్లో ఉన్నట్లు క్రియేట్ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు.
దమ్మాయిగూడకు చెందిన ప్రవీణ్కు మరో 15 రోజుల్లో పెళ్లి ఉంది. అయితే ఈ పెళ్లి నుంచి తప్పించుకునేందుకే అతను ఈ డ్రామా ఆడినట్లు చెబుతున్నారు పోలీసులు. తల్లిదండ్రుల్ని మోసం చేయడమే కాకుండా.. పోలీసులను సైతం తప్పుదారి పట్టించిన ప్రవీణ్పై కేసు నమోదు చేశారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com