పాకిస్థాన్ పెద్ద కుట్ర? ఉగ్రనేత మసూద్ అజార్ విడుదల..
ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూనే పాకిస్థాన్ ఉగ్ర సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తోంది. జైలులో ఖైదీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ను విడుదల చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్ను భారీ దెబ్బతీయాలనే కుట్రతో ఆ దేశం పావులు కదుపుతోన్నట్లు భారత్ పసిగట్టింది. అందులో భాగంగానే మసూద్ ను విడుదల చేసినట్టు భావిస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే మసూద్ కదలికలను అంచనా వేస్తోంది.
అతను ఏ క్షణమైనా భారత్ పైకి జైషే మహమ్మద్ ఉగ్రవాదులను ఉసిగొల్పే అవకాశం ఉందని ఐబీ భావించింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్తాన్, సియోల్కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని హెచ్చరించింది. కాగా మసూద్ చనిపోయాడని ఒకసారి.. చావుబ్రతుకుల్లో ఉన్నాడని మరొకసారి నాటకం ఆడింది. అయితే అంతర్జాతీయంగా పలు దేశాలు పాక్ వక్రబుద్ధిని నమ్మలేదు. మసూద్ ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల ప్రపంచ దేశాలు పాక్పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. తాజాగా అతన్ని విడుదల చేయడంతో మళ్ళీ అలజడి నెలకొంది. ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయ సమాజం ఎన్ని చీవాట్లు పెట్టినా పాక్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com