డెంగ్యూ తీవ్రత లేదు.. 99 శాతం జ్వరాలు అందువల్లే : మంత్రి ఈటల
తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తుండటంతో టీఆర్ఎస్ సర్కారు అప్రమత్తమైంది. మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను సందర్శిస్తున్నారు వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇందులో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి, జగదీష్ రెడ్డిలతో కలిసి ఆయన.... సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
ఆసుపత్రిని సందర్శించిన మంత్రులు.. అక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వ్యాధుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రోగులకు వివరించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విషజ్వరాలు విజృంభిస్తున్నందున... వైద్యులు, సిబ్బంది 2 నెలల వరకు సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు..
అనంతరం.. ఖమ్మం జిల్లాలోనూ పర్యటించారు మంత్రి ఈటల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జ్వరాల వార్డులో రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డెంగ్యూ తీవ్రత అంతగా లేదన్న ఈటల.... 99 శాతం జ్వరాలు వైరల్ ఫీవర్లు మాత్రమేనన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సర్కారు ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేట్లు చేస్తామన్నారు మంత్రి ఈటల.
విషజ్వరాలతో పాటు డెంగ్యూను అదుపు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సర్కారు ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేట్లు చేస్తామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com