పోలీసులకు అఖిలప్రియకు మధ్య వాగ్వాదం

పోలీసులకు అఖిలప్రియకు మధ్య వాగ్వాదం

పల్నాడులో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారీగా మోహరించిన పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, సీనియర్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో చలో ఆత్మకూరును అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నేతలను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాత్రి నుంచే పోలీసులు మాజీ సీఎం నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం విధించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం లేదని... ఇది దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. బాధితులకు సంఘీభావంగా ఉదయం 8గంటల నుంచే తాను దీక్షలో ఉన్నట్టు చంద్రబాబు ప్రకటించారు. సాయంత్రం 8గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు కూడా దీక్షలు, ధర్నాలు, ఆందోళనలను శాంతియుత వాతావరణంలో చేపట్టాలని పిలుపునిచ్చారు.

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆత్మకూరుతో బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. గేటు వద్ద ఆపిన పోలీసులు ఆయన్ను అనుమతించమన్నారు. దీంతో లోకేష్‌ ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొన్నటివరకు తన ఇంటి వద్ద 144 సెక్షన్‌ అమలు చేసుకున్నారు. నిన్న పల్నాడులో.. ఇప్పుడు ప్రతి టీడీపీ నాయకుడి ఇంటిముందు నిబంధనలు అమలు చేయడం తుగ్లక్‌ పాలనకు పరాకాష్ట అని లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం బాధితులకు అండగా చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అడుగడుగునా అసమర్ధ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని లోకేష్‌ మండిపడ్డారు.

అటు విజయవాడలో ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. విజయవాడ ప్రధాన కూడళ్లల్లో పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే రహదారులైన బెంజి సర్కిల్, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ దినేష్ రెడ్డి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కేఈ ప్రభాకర్‌లతో పాటు మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నాయకుల అరెస్ట్‌తో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిండిపోయింది.

ఉదయం తెలుగుయువత నాయకులు టీడీపీ అధినేత ఇంటివద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు వారికి అడ్డుకుని అరెస్టు చేశారు. దేవినేని అవినాష్‌ సహా పలువురు నేతలకురహస్య ప్రాంతాలకు తరలించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, మంతెన సహా పలవురు నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అటు అధినేత గృహనిర్డందంలో ఉన్నారని తెలుసుకుని పలువురు నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారిని కూడా లోపలకు అనుమతించకుండా అరెస్టు చేశారు పోలీసులు. నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడు, కొనకళ్ల నారాయణ సహా పలువురు నేతలు అరెస్టు చేసి స్టేషనక్ కు తరలించారు. అటు రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని.. అధికారంలో ఉండి బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యకర్తలను రక్షించుకునేందుకు జైలుకెళ్లడానికి కూడా తాము సిద్ధమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అచ్చెన్నాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిల ప్రియను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు.. అఖిలప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రూమ్‌ను కూడా పోలీసులు తనిఖీ చేశారు. దీనిపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్నటి నుంచే చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చిన ఛలో ఆత్మకూరును భగ్నం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పునరావాస శిబిరానికి ఆహారం సరఫరాను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శిబిరం వద్ద నుంచి మీడియాను బలవంతంగా బయటకు పంపివేశారు.

Tags

Read MoreRead Less
Next Story