జగన్ మూర్ఖత్వంతోనే ఇలాంటి పరిస్థితులు - చంద్రబాబు

జగన్ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిత్వంతో రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. సొంతపార్టీలోనే సీఎం తీరుపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఎవరూ బతకడానికి వీల్లేదన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. దేశమంతా ఛీకొట్టే పరిస్థితి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా కూడా జగన్ విధానాలను తప్పుపట్టిందని గుర్తుచేశారు చంద్రబాబు.
రాజధాని అమరావతి వ్యవహారంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు చంద్రబాబు. ఓ రాజధాని అంటూ లేకపోతే పిల్లల భవిష్యత్ ఏంటని అందరూ ఆవేదనలో ఉన్నారని చెప్పారు. స్థానికులకే ఉద్యోగాలన్న జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. రేపు ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటే ఏం చేస్తారని నిలదీశారు? జగన్ మూర్ఖత్వంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురౌతున్నాయని ఫైర్ అయ్యారు చంద్రబాబు.
తెలుగుదేశం నేతలపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు విధానాలు, అరాచకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కలిసికట్టుగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు.
Also watch:
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com