వైసీపీ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయి : పవన్ కల్యాణ్
వైసీపీ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ 100 రోజుల పాలనపై 9 అంశాలతో 33 పేజీల నివేదికను ఆయన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. ప్రజారోగ్యం పడకేసిందన్నారు. సీజన్ వ్యాధుల నివారణలోను ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ప్రజారంజక విఫల ప్రభుత్వంగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్.
వ్యాపారవేత్తలను బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అమరావతిపై తలో మాట మాట్లాడుతూ సందిగ్ధంలో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశమన్నారు. అమరావతికి టీడీపీ వాళ్లు గెజిట్ ఇవ్వలేదంటున్న వైసీపీ మంత్రులు.. తాము ఎందుకివ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో వైసీపీ సాధించిన మెజారిటీతో ఏడాది పాటు తమకు పని ఉండదని భావించినట్టు పవన్ చెప్పారు. కానీ.. మూడు వారాల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో ఆందోళనకు దారితీశాయని విమర్శించారు. వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే పోరుబాట తప్పదని హెచ్చరించారు పవన్. ఇన్నాళ్లలో సాధించింది ఏదైనా ఉందంటే.. అది ప్రజా వేదికను కూల్చడమేనని ఎద్దేవా చేశారాయన.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com