ఆర్టికల్‌ 370పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ఆర్టికల్‌ 370పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆర్టికల్‌ 370పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ పరిణామాలపై గులాం నబీ ఆజాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీతారాం ఏచూరి సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కశ్మీర్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్న పిటిషనర్ల వాదనపై స్పందించింది. కశ్మీర్‌లో పరిస్థితులను తెలుసుకునేందుకు తానే స్వయంగా అక్కడ పర్యటిస్తానని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ చెప్పారు.

అలాగే కశ్మీర్‌ వెళ్లేందుకు పిటిషనర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు అనుమతి మంజూరు చేశారు.. శ్రీనగర్, అనంత నాగ్, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పర్యటించేందుకు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, ర్యాలీలు, స్పీచ్‌లు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు జరపకూడదని షరతు విధించింది. నాలుగు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని తమకు నివేదించాలని ఆజాద్‌ను కోర్టు కోరింది. పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు అందుబాటులో ఉందా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక కశ్మీర్‌లో అంతా సవ్యంగా ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి కూడా వెళ్లలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరోవైపు స్వయంగా తానే పర్యటిస్తానని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ చెప్పడంతో వాస్తవ పరిస్థితులు ఆయనకు అవగతమవుతాయని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story