వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్ ధరలు..
సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడుల ప్రభావం మనదేశంలో పెట్రో ఉత్పత్తులపై తీవ్రంగా పడుతోంది. వరుసగా 8 రోజులుగా పెట్రో ధరలు మండుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 23 పైసలు పెరగగా, లీటర్ డీజిల్పై 15 పైసలు పెరిగింది. హైదరాబాద్లో పెరిగిన ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ 78 రూపాయల 80 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ 73 రూపాయల 11 పైసలకు పెరిగింది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గరిష్టంగా పెట్రోల్పై 2 రూపాయలు, డీజిల్పై ఒక రూపాయి 63 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 64 డాలర్లుగా ఉంది. పెట్రో ధరల పెరుగుదలకు సామాన్యుడు హడలిపోతున్నాడు. పెట్రోల్ ధర ఈ ఏడాదిలో ఇదే గరిష్టం కాగా, ఇటీవలి కాలంలో డీజిల్ ధర ఇదే అత్యధికం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్పై తీవ్రంగా పడుతోంది.
సౌదీ నుంచి ముడిచమురు సప్లయ్లో ఎలాంటి సమస్యలు ఉండవని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినప్పటికీ... ధరలు మాత్రం రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. డ్రోన్ దాడుల ప్రభావం చమురు ధరలపై క్రమంగా పెరుగుతోంది. చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులతో రోజుకు 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి గండి పడుతుందని అంచనా.
భారత్ తన అవసరాల్లో 83 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునేది ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 2017.3 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, దీంట్లో సౌదీ అరేబియా వాటా 40.33 మిలియన్ టన్నులుగా ఉంది.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు భయాలు రూపాయిని కూడా వెంటాడుతున్నాయి. రూపాయి బలహీన పడటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. దీంతో ముడిచమురు దిగుమతులపై పెద్ద మొత్తంలో భారత్ చేతి చమురు వదులు కోవాల్సి వస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com