ఆదివారం నుంచి తెలంగాణ సెక్రటేరియట్కి తాళం
ఆదివారం నుంచి తెలంగాణ సెక్రటేరియట్కి తాళం వేయాలని GAD నిర్ణయించింది. అన్ని శాఖలు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఆగస్టు 8న ప్రారంభమైన సెక్రటేరియట్ షిఫ్టింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 90 శాతం షిఫ్టింగ్ పూర్తి పూర్తయిందని చెబుతున్నారు అధికారులు. CMOను బేగంపేట మెట్రో రైల్ భవన్కు తరలించగా.. మిగతా శాఖలలో చాలా వాటిని BRK భవన్కు తరలించారు. CS జోషితో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఐటీ కార్యదర్శి చిరంజీవితో పాటు ఉన్నత అధికారుల కార్యాలయాలు ఇప్పటికే సిద్ధం కాగా.. మరో వారం, పది రోజుల్లో మిగిలినవారి చాంబర్లు పూర్తయ్యే అవకాశాలున్నాయి. సెక్రెటరీ షిఫ్ట్ కావడంతో BRK భవన్లోని ఫస్ట్ ఫ్లోర్లో తొమ్మిది మంది మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు.
మంత్రులు ఉండే ఆఫీస్ ప్రాంతాలు ఇలా ఉన్నాయి. మాసబ్ ట్యాంక్ మున్సిపల్ శాఖ కార్యాలయంలోని కేటీఆర్, అరణ్య భవన్లో హరీష్రావు, లక్డీకాపూల్ ఏపీ డీజీపీ ఆఫీస్లో మహ్మూద్ అలీ, హాకా భవన్లో నిరంజన్ రెడ్డి, రవీంద్ర భారతిలో శ్రీనివాస్గౌడ్, అబిడ్స్ దేవాదాయ శాఖ కమిషనరేట్లో ఇంద్రకరణ్ రెడ్డి, బషీర్బాగ్లోని ESCRT బిల్డింగ్లో సబితా ఇంద్రారెడ్డి బాధ్యలు నిర్వహిస్తారు. ఇక మింట్ కాంపౌడ్లోని TSSPDCL కార్పొరేట్ ఆఫీస్లో జగదీశ్ రెడ్డి, మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రమంజిల్లోని ENC బిల్డింగ్లో ప్రశాంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 45 లోని మహిళా శిశు సంక్షేమ భవన్లో మల్లారెడ్డి, BRK భవన్లో ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్లోని రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్లో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖైరతాబాద్లోని RTA ఆఫీస్లో పువ్వాడ అజయ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు.
1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కాలం నాటి నుంచి ఈ సచివాలయం సేవలందిస్తోంది. సచివాలయంలోనే సేవలందించాలని ఇతర పార్టీల నాయకులు, పలువురు మేధావులు చెబుతున్నప్పటికీ.. తెలంగాణ సర్కారు మాత్రం పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. దీంతో ఇక పాత సచివాలయం వైభవం గతంగానే మిగలనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com