హుజూర్ నగర్ ఎప్పుడూ కాంగ్రెస్ వైపే.. కానీ ఇప్పుడు మాత్రం..
మాటల తూటాలు.. విమర్శలు, ప్రతి విమర్శలతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున కీలక నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. హుజూర్నగర్లో తొలిసారి గులాబి జెండా ఎగురవేయాలని చూస్తున్న TRS.. ఈ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఇతర పార్టీలకంటే ప్రచారంలో దూకుడు చూపిస్తోంది. శుక్రవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షో నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు చోట్ల ప్రసంగించనున్నారు. అటు కాంగ్రెస్కు ఘోర పరాజయం తప్పదన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి..
హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 తిరస్కరణకు గురయ్యాయి. గురువారం మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో నిలిచిన 28 మందిలో 13 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా , మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులు. ఇక ఈ ఎన్నికలో సీపీఐ.. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది. టీజేఎస్.. కాంగ్రెస్తో దోస్తీ కట్టింది. టీడీపీ, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది.
అటు కాంగ్రెస్ కూడా సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి పట్టుబట్టి మరీ తన భార్య పద్మావతి రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఈ గెలుపు ఆయనకు సవాల్ గా మారింది. అందుకే అక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామగ్రామానికి.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనుంది. 24న వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నియోజకవర్గం ఎర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్న ఓటరు దేవుడు... ఈసారి ఎవరిని కరుణిస్తాడనన్నది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com