కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. పార్లమెంట్లోని నార్త్బ్లాక్లో దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు..
మోదీతో భేటీలో గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కల్పించడంతో పాటు... ఇతర ప్రాజెక్టులకు వివిధ కేంద్ర పథకాల నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరనున్నారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఇక విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలు, జోనల్ వ్యవస్థలో మార్పులు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపైనా వినతిపత్రం సమర్పించనున్నారు.
2018 డిసెంబరులో చివరి సారిగా మోదీని కలిసిన కేసీఆర్.. రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఇప్పటి దాకా కలవలేదు. ఈ ఏడాది మే నెలలో జరిగిన మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ హాజరుకాలేక పోయారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పు-నిప్పుగా మారిన దశలో దాదాపు 10 నెలల తర్వాత జరుగుతున్న మోదీ-కేసీఆర్ సమావేశం ఆసక్తిని రేపుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com