సాయంత్రం 5 గంటలకు అమ్మవారి తెప్పోత్సవం

సాయంత్రం 5 గంటలకు అమ్మవారి తెప్పోత్సవం

విజయదశమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దసరారోజు రాజరాజేశ్వరీదేవిగా కొలువైన అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. సోమవారం దాదాపు 2 లక్షల మంది వస్తే దసరారోజు అంతకుమించిన రద్దీ ఉండబోతోంది. రాక్షస సంహారంతో అమ్మవారు ముల్లోకాలకు శాంతిసౌభాగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించిన రోజు కాబట్టి దానికి ప్రతీకగా ఇవాళ విజయదశమిని అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. భవానీల దీక్ష విరమణలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో.. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరుముడులు సమర్పించేందుకు భవానీల కోసం కొండ కిందే ఏర్పాట్లు చేశారు. ఇవాళ, రేపు కూడా దుర్గమ్మ.. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలోనే భక్తుల్ని కరుణిస్తారు.

ఈ 9 రోజుల్లో 14 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దసరారోజు దాదాపు రెండున్నర లక్షల మంది కొండకు వస్తారని అంచనా వేస్తున్నారు. టికెట్లు, ప్రసాదాల అమ్మకాలు, వివిధ సేవల రూపంలో దేవస్థానానికి 3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.నిన్నటి ఆదాయం 53 లక్షల 93 వేలు అని ఆలయ అధికారులు తెలిపారు. ఏటా దసరా ఉత్సవాల ముగింపురోజు అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరుపుతారు. దసరారోజు సాయంత్రం 5 గంటలకు ఈ ఉత్సవం మొదలవుతుంది. హంస వాహనంపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తుల్ని నదిలో 3 సార్లు విహారం చేయిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story