భారతీయ రైల్వే ప్రైవేటీకరణ?

భారతీయ రైల్వే ప్రైవేటీకరణ?

భారత రైల్వే ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. తేజాస్‌ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశలవారీగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది కేంద్రం. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ . ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్రం నియమిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల ప్రైవేటకీరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ రైల్వేల్లోనూ ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన సాధికార కమిటీ ఏర్పాటవుతుందన్నారు.

ప్రయాణీకుల రైళ్ల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రైల్వే మంత్రితో విస్తారంగా చర్చించామన్న ఆయన.... కనీసం 50 రైల్వే స్టేషన్లు, 150 రైళ్లను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నామని లేఖలో తెలిపారు. అక్టోబర్ 4న మొదలైన లక్నో-ఢిల్లీ మార్గం గుండా వెళ్లే తేజాస్ ఎక్స్‌ప్రెస్ తొలి రైల్వేయేతర రైలు. ఐఆర్సీటీసీ కొత్త బెనిఫిట్స్‌ను ప్రయాణికుల కోసం అమలులోనికి తీసుకువస్తుంది. కాంబినేషన్ మీల్స్, రూ.25లక్షల వరకూ ఉచిత ఇన్సూరెన్స్, రైలు ఆలస్యంగా వస్తే దానికి డబ్బులు ఇలా కొత్త పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story