పాలల్లోనూ ప్లాస్టిక్.. కూకట్పల్లి పాలబూత్ నిర్వాకం
ఏం తినాలి.. ఏం తాగాలి. అన్నీ కల్తీ.. అక్రమ సంపాదనే ధ్యేయంగా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. పాలల్లో నీళ్లు కలుపేసి.. చిక్కదనం కోసం పౌడర్లు, పిండి వంటివి కలుపుతారని తెలుసు. కానీ ప్లాస్టిక్ని కూడా పాలల్లో కలిపేస్తూ కస్టమర్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రతి ఇంటా పాలు, పాల పదార్థాలు రోజు వారి జీవితంలో నిత్యం దర్శనమిస్తుంటాయి. చిక్కటి పాలతో చక్కని టీ తాగి రోజుని ప్రారంభించే నగర వాసికి ఇది పిడుగులాంటి వార్తే. తాజాగా హైదరాబాద్లో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నట్లు వెలుగులోకి రావడంతో నగరవాసి ఆందోళన చెందుతున్నాడు.
కూకట్పల్లిలో ప్లాస్టిక్ పాలు అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రగతినగర్లో నివసించే పవన్, సౌమ్య దంపతులు శుక్రవారం ఉదయం స్థానిక మిల్క్ బూత్ నుంచి లీటరు పాలు తీసుకున్నారు. ఇంటికి తీసుకువెళ్లి వేడి చేయగా పాలు ముద్దలా మారాయి. అనుమానంతో ఆ ఇంటి ఇల్లాలు పాలముద్దను పట్టుకుని చూడగా ప్లాస్టిక్ మాదిరిగా సాగింది. దీంతో పవన్ మిల్క్బూత్కి వెళ్లి పాల వ్యాపారిని నిలదీయగా.. మాకు వచ్చిన పాకెట్లు అమ్ముతున్నాము. మాకు మాత్రం ఏం తెలుసు అవి కల్తీ జరిగినవీ అని దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో బాధితుడు బాచుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com