లలితా జ్యువెలర్స్లో చోరీ.. మైండ్ బ్లాంక్ అయ్యేలా ప్లాన్
చెన్నై లలితా జ్యువెలర్స్లో చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే గజదొంగ మురుగన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరుపుతున్నారు. దీంతో దాచిన బంగారమంతా బయటకు వస్తోంది. ఇప్పటికే విచారణలో మురుగన్ ఇచ్చిన వివరాల ఆధారంగా గాలింపు జరిపిన పోలీసులు చోరీ చేసిన సొత్తును గుర్తించారు. దోచుకున్న బంగారాన్నంతా కావేరి నదిలో దాచిపెట్టాడు గజదొంగ మురుగన్.
తమిళనాడు తిరుచ్చి లలితా జువెలరీ షోరూమ్లో ఈనెల 3న భారీ చోరీ జరిగింది. మురుగన్ ముఠా 13 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. మాస్కులు వేసుకున్న దొంగలు ఎవరో తెలియక, వేలిముద్రలు కూడా లభించని పరిస్థితుల్లో ఈ కేసును ఛేదించటం తిరుచ్చి పోలీసులకు సవాల్గా మారింది. తిరుచ్చి సత్తిరం బస్టాండు ప్రాంతంలో నమోదైన సుమారు వందకుపైగా సెల్ఫోన్ సంభాషణలను పరిశీలించినప్పటికీ చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో తిరుచ్చి, తిరువారూరు జిల్లాల్లో వాహనాలు తనిఖీలు చేపట్టారు పోలీసులు.. అయితే, అదే సమయంలో ముఠాలోని సుభ్యుడు మణికంఠన్ పట్టుబడడంతో దోపిడీ గుట్టు రట్టైంది. చోరీకి పాల్పడింది ఇద్దరు కాదు.. 8 మంది సభ్యుల ముఠా అని ఆ తర్వాతే తేలింది. మణికంఠన్ వద్ద నుంచి లలిత జువెలరీ షోరూంలో చోరీ చేసిన 5 కేజీల నగలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు.. మురుగన్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణలో కీలక ఆధారాలను సేకరించారు. చోరీ తర్వాత బంగారాన్నంతా మూటకట్టి బ్యాగులో పెట్టి దాన్ని మరో కవర్లో చుట్టేసి ఎవరూ గుర్తించకుండా కావేరి నదిలో దాచి పెట్టింది ఈ గ్యాంగ్. అంతా సర్దుకున్న తర్వాత గ్యాంగ్లోని సభ్యులంతా ఈ బంగారాన్ని వాటాలేసుకుని పంచుకోవాలన్నది ప్లాన్. అయితే, ఈ ప్లాన్ మణికంఠన్ అరెస్టుతో బెడిసికొట్టింది. పాతాళంలో దాచిపెట్టిన బంగారాన్నంతా పోలీసులకు పట్టిచ్చేలా చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com