అయోధ్య కేసులో మారుతున్న పరిణామాలు..

అయోధ్య కేసులో మారుతున్న పరిణామాలు..

అయోధ్య కేసులో వాదనలు ముగిశాయి. ఇక తీర్పే మిగిలి ఉంది. వచ్చే నెల 17లోపు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఏమైనా చెప్పాలంటే గురువారం నుంచి మూడు రోజుల పాటు రాతపూర్వకంగా తెలియజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే వివాదాస్పద స్థలంపై తమకు ఉన్న హక్కును వదులుకోడానికి ప్రధాన కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్‌ బోర్డు అంగీకరించడం ఆసక్తి రేపుతోంది. ఇందులో భాగంగా వక్ఫ్‌ బోర్డు బుధవారం చివరి రోజు మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా తన ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు పంపింది. దీంతో దశాబ్దాలుగా సాగుతున్న రామజన్మభూమి వివాదం సామరస్య పూర్వకంగా కోర్టు వెలుపలే పరిష్కారం కావొచ్చన్న ఆశ అందరిలో చిగురిస్తోంది.

సున్నీ వక్ఫ్‌ బోర్డు అంగీకరించిన ఓ పరిష్కార ప్రణాళికను మధ్యవర్తిత్వ బృందం కోర్టుకు సమర్పించింది. ఈ ప్రణాళికపై సున్నీ బోర్డుతో పాటు కొన్ని హిందూ పక్షాలు కూడా సంతకం చేశాయి. కేసుపై విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ సెటిల్మెంట్‌ ప్రణాళికను పరిశీలిస్తుంది. కేసును విచారించిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఛాంబర్లలోనే సమావేశం అవుతుందని సుప్రీం కోర్టు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 8 నుంచి 155 రోజుల పాటు ఫైజాబాద్‌లో మధ్యవర్తిత్వ బృందం.. ప్రధాన కక్షిదారులతో పలు సార్లు చర్చించినా ప్రయోజనం లేకపోవడంతో మధ్యవర్తిత్వ యత్నం విఫలమైనట్లేనని ఆగస్టు 2న సుప్రీం ప్రకటించింది. కానీ సెప్టెంబరులో మళ్లీ ఈ బృందం ఓ అఫిడవిట్‌ వేసిన ఫలితం లేకుండా పోయింది. విచారణ కొసాగిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మధ్యవర్తిత్వ ప్రతిపాదనతో ముందుకు రావడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story