అతడి అడ్రస్ చెప్పండి ప్లీజ్.. కారు గిప్ట్‌గా పంపిస్తా: ఆనంద్ మహీంద్రా

అతడి అడ్రస్ చెప్పండి ప్లీజ్.. కారు గిప్ట్‌గా పంపిస్తా: ఆనంద్ మహీంద్రా

anand-mahindra

ఆనంద్ మహీంద్రా అందరిలాంటి వ్యక్తి కాదు. ఆయనకు ఆ ట్వీట్ నచ్చిందంటే అందరికీ షేర్ చేస్తారు. సోషల్ మీడియా వేదికగా ఆ ట్వీట్‌పై స్పందిస్తారు. అవసరమనుకుంటే సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వావ్.. సార్ మీరు సూపర్ అని మనం కూడా ఆనంద్ మహీంద్రాను అనకుండా ఉండలేకపోతాం.. ఆయనకు అంతగా నచ్చిన ఆ వార్త సారాంశం.. కర్ణాటకలోని మైసూర్ వాసి దక్షిణామూర్తి కృష్ణ కుమార్. అమ్మ ఏనాడూ గడప దాటింది లేదు. ఎక్కడికీ వెళ్లలేదు. ఏమీ చూడలేదు. ఆఖరికి ఊరికి దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయం బేలూరు హలిబేడును కూడా చూడలేదు.. అదే విషయాన్ని మాటల సందర్భంలో కొడుకుతో చెప్పింది. అమ్మను ఇప్పటివరకు ఎక్కడికీ తీసుకువెళ్లలేకపోయానని కొడుకు దక్షిణామూర్తి కృష్ణకుమార్ బాధపడ్డాడు. నాలుగేళ్ల క్రితం నాన్న మరణించాడు. ఆయన వాడిన స్కూటర్ ఉంది. అమ్మని తీసుకుని దానిమీద తీర్ధయాత్రలు చుట్టిరావాలనుకున్నాడు.. అలా అయితే నాన్నకూడా తమతో పాటే ఉన్నట్టుంటుందని భావించాడు. తను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అమ్మని స్కూటర్ వెనుక ఎక్కించుకుని మాతృసేవా సంకల్ప్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అలా 2018 జనవరి 18న ప్రారంభమైన వారి స్కూటర్ ప్రయాణం ఇప్పటి వరకు 48,100 కి.మీలు పూర్తి చేసింది. దేశంలోని పలు ప్రాంతాలనే కాక, సరిహద్దు దేశాలైన మయన్మార్, భూటాన్, నేపాల్‌లోని దేవాలయలను కూడా అమ్మకు చూపెట్టారు. దక్షిణామూర్తి గురించి తెలుసుకున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. అది చూసిన ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ.. ఇది ఒక అందమైన కథ. ఇందులో అమ్మ పట్ల ప్రేమే కాదు.. దేశభక్తి కూడా దాగుంది. షేర్ చేసినందుకు కృతజ్ఞతలు మనోజ్. అతడిని నాకు పరిచయం చేస్తే మహీంద్రా కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ బహుకరిస్తాను. వాళ్లు తమ తరువాతి ప్రయాణాన్ని కారులో కొనసాగించవచ్చు అని మహీంద్రా ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.

Read MoreRead Less
Next Story